Saturday, 16 May 2026

దివ్య సాలగ్రామ క్షేత్రం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం వ్రాసిన మహర్షి .. శ్రీమాన్‌ ప్రతివాది భయంకరం అణ్ణన్‌ స్వామి. నేను ఆ మహనీయునికి పదిహేనవ తరం మనవడిని.

అణ్ణన్‌ స్వామి సేవించుకున్న ద్వాదశ సాలగ్రామాలు భూ నీళా సమేత లక్ష్మీనారాయణ అర్చామూర్తులు వారి వంశస్థుల సేవలో అరారుతూ .. గత ఆరున్నొక్క వందల ఏళ్ల నుంచి పలువురను తరింపజేశాయి. ఆ పరంపరలో భాగంగా ధన్యులైన పెద్దల మార్గంలో జీవనం సాగించే అదృష్టం నాకు కలిగింది.

అణ్ణన్‌ స్వామి సేవించుకున్న సాలగ్రామాలు అర్చామూర్తులు కొలువుదీరిన క్షేత్రమే దివ్య సాలగ్రామ క్షేత్రం. బ్రహ్మవిద్యకు ఆంబన అయిన సాలగ్రామ సేవకు జీవనాన్ని అంకితం చేసుకుని, ఋషిమార్గంలో తపశ్చర్యకు గురువును ఆశ్రయించి నా శేషకాలాన్ని ఈ ప్రాంగణంలోనే వినియోగం చేస్తుండడం నా దినచర్య. 

ఈ క్షేత్రంలో నిత్యం ఋషిప్రోక్తమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగవత్ప్రేరితమైన యజ్ఞయాగాలతో పాటు వ్యక్తి, కుటుంబం, సమాజం శ్రేయస్సుకు ఉపయుక్తమైన క్రతువుల నిర్వహణ కూడా జరుగుతూ ఉంటుంది.

ధర్మానుష్టానం

భగవంతుని అనుగ్రహం, దేవతల ఆశీస్సులు మీకు అందాలనే సంకల్పంతో నిర్వహించేది ధర్మానుష్టానం. స్వయంభువుగా ఏర్పడిన వినాయక సాలగ్రామానికి, తర్వాత సహజ విభూతి రేఖలతో ఏర్పడిన శివనాభము అనే ఈ సాలగ్రామ లింగానికి అభిషేకం జరుగుతుంది. అనంతరం భూదేవి, నీళాదేవి సహిత లక్ష్మీనారాయణులతో కొలువుదీరిన ఈ పన్నెండు విష్ణు సాలగ్రామాలకు అభిషేకం అర్చన జరుగుతుంది. ద్వాదశ అంటే పన్నెండు సాలగ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ 108 తిరుపతుల క్షేత్ర మహాత్మ్యం ఉంటుందని శాస్త్రం. ఈ సాలగ్రామ సేవ అనంతరం హోమం జరుగుతుంది.

యుగధర్మ ట్రస్ట్

ఋషి జీవన విధాన ప్రచార బాధ్యతతో యుగధర్మ ట్రస్టు గత పదేళ్లుగా భారతదేశమంతటా వందలాది యజ్ఞాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ గురు పౌర్ణమిని 09-07-2017 పురస్కరించుకుని ఊరూరా గో యజ్ఞం నిర్వహించాలని, ఊరంతా గాయత్రీ మంత్రం వినిపించాలని, ఇంటింటా సాలగ్రామ అనుష్టానం జరపాలనే ఆశయంతో భారత యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ ఆశయం క్రియాత్మకంగా వ్యాప్తి చెందాలనే దృఢ నిశ్చయంతో దైవ చింతన గల ఎన్నారైలు, ధర్మ చింతన గల విద్యావేత్తలు, అథ్యాత్మిక చింతన గల సైంటిస్టులు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. సనాతన ధర్మ సంపన్నమైన మన దేశాన్ని, మానవాళిని అథ్యాత్మిక శక్తితో నడిపించడానికి మీరు కూడా అండగా నిలవాలి.

No comments:

Post a Comment