Monday, 9 June 2025

క్షేత్ర దర్శనం ఎందుకంటే ...?

ఇటీవల శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళాం. శ్రీశైల క్షేత్రం ఋషుల తపోభూమి. అక్కడ శివుడు ఎలా వెలిశాడు అనే ప్రశ్న వచ్చింది. ఋషులు సూక్ష్మస్థితిలో ప్రసారం చేసుకునే తమ అనుభవాలను, తాను కూడా వినాలని శివుడు వెలిసినట్టు ప్రతీతి. శివలింగం అంత చిన్నదిగా ఉన్నదేమిటని పిల్లలకు అనుమానం వచ్చింది. ఋషుల తపోనిష్టకు భంగం కలగకుండా శ్రవణేంద్రియాన్ని మాత్రం బయటకు పెట్టి ఉన్నందున .. అన్న జవాబుకు వారు సంతుష్టు లయ్యారు. అయితే శివుడే ఎందుకు వచ్చాడు, అక్కడున్న ఋషులంతా శివుడి గురించే తపస్సు చేస్తున్నారా అని మరో ప్రశ్న వచ్చింది. నిజానికి తపస్సు అన్నది శివయోగం. తపస్సు ద్వారా అన్ని కర్మలు కరిగిపోతాయి కాబట్టి జీవుడికి తపస్సు తప్పనిసరి. తపస్సు ద్వారా అన్ని కర్మలు కరిగిపోయిన జీవుడు శివయోగంలో సిద్ధి పొంది, శివైక్యం చెందుతాడు. అందుకని శివుడు. ఈ నేపథ్యంలో తపస్సు, క్షేత్రం, దైవం గురించి కాస్త తెలుసుకుందాం.
                                                           -------------
నిజానికి ఎవరూ తపస్సు చేయరు. చేయలేరు. తపస్సు అనేది దానంతట అది ఏర్పడుతుంది. అలా ఏర్పడాలంటే ఎవరైనా చేయాల్సింది జపం మాత్రమే. ఆధ్యాత్మికంగా మనం చేయగలిగింది జపం ఒక్కటే. ఆ జపమే ఏకాగ్రతగా, ధ్యానంగా, తపస్సుగా మారుతుంది. ఈ మారడంలో ఎవ్వరి ప్రమేయం ఉండదు. జప సాధకులకు శ్రీశైలం అద్భుత ప్రదేశం. ఏ ప్రదేశమైతే జప బలాన్ని తాను తీసుకోగలిగి, తన బలాన్ని జప సాధకులకు ఇవ్వగలుగుతుందో .. దాన్ని ‘క్షేత్రం’ అంటారు. అలాంటి క్షేత్రాన్ని దర్శించుకోవడం అంటే .. జప బలాన్ని ఇవ్వడం లేదా క్షేత్ర బలాన్ని తీసుకోవడం .. కోసం మాత్రమే. ఇది తెలుసుకుని చేసే తీర్థయాత్రలే పారమార్ధికమైనవి. అలా జపం క్రమంగా తపస్సుగా మారగల అవకాశం ఉన్న క్షేత్రం శ్రీశైలం కాబట్టి అది తపోభూమిగా ఖ్యాతి చెందింది. జీవుడు తానుగా క్షేత్రంతో మమేకమవడమే క్షేత్రదర్శనం. కొన్ని సందర్భాల్లో క్షేత్రమే తానుగా జీవుడిని రప్పించుకోవడం, జీవుడితో కదిలి వెళ్లడం జరుగుతుంది. ‘‘ ఆయన ఉన్న చోటు సాక్షాత్తూ క్షేత్రమే ’’ అని కొందరి గురించి అనుకోవడం మనం వింటూ ఉంటాం. యోగులకు క్షేత్రంతో ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాసుడు దక్షిణాన ద్రాక్షారామానికి, అగస్త్యుడు ద్రవిడ దేశానికి రావడం ఈ కోవలోవే. వ్యాసునితో కాశీ క్షేత్రం కదిలి వచ్చింది కాబట్టే ద్రాక్షారామం ‘దక్షిణ కాశీ’గా పేరు గాంచింది.
                                                         ------------
ఇకనుంచీ మనమంతా క్షేత్ర రహస్యం తెలుసుకుని క్షేత్ర దర్శనం చేసుకుందాం. భగవంతుని అనుగ్రహం పొందుదాం.



Friday, 31 January 2025

తత్వోపాసన-సేవ

                         చివరిభాగం

ఒక విషయం ఏంటంటే సృష్టిలో సహాయం అనేది ఉండదు. సేవ అనేది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సహాయంలో మూడు గుణాలు ఉంటాయి. సేవలో త్రిగుణాలు ఉండవు. 

ఇలాంటి గుణరహితమైన సేవాస్థితికే బ్రాహ్మణస్థితి అని పేరు. ఇలాంటి బ్రాహ్మణ్యం శాశ్వతంగా ఒక జీవుడిలో నిలబడి పోవాలంటే తత్వ ఉపాసన చేయాల్సిందే. 

తత్వ ఉపాసనతో బ్రాహ్మణ్యం శాశ్వతం కాలేనప్పుడు ఆ జీవుడు తరచు అబ్రాహ్మణ స్థితిలో కూరుకుపోతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే నాలుగు మార్గాలు ఏర్పడ్డాయి. తత్వాన్ని భౌతికంగా నిలపాలన్నా, ఆలోచనల వేగం నియంత్రించాలన్నా ఆహార నియమం పాటించాల్సిందే. 

దీన్ని పాటించే వారికి అగ్నిహోత్రం ఇచ్చారు. అది పాటించలేని వారికి 'శ్రమ' ఇచ్చారు. ఈ శ్రమ వర్గమే సంఘ రక్షణకు క్షాత్రంగా, సంఘ కార్యకలాపాల నిర్వహణకు వాణిజ్యంగా నిలబడింది. ఇలా నాలుగు మార్గాలు ఏర్పడ్డాయి 

ఈ మార్గాలన్నీ సేవకు మార్గాలే. గుణ రహితమైనటువంటి సేవకు మార్గాలే. సేవా స్థితికి మారుపేరైన బ్రాహ్మణస్థితికి చేరుకోవటానికి మార్గాలే.

పేర్లు అనేవి మార్గాన్ని గుర్తు చేసేవి. ఎక్కువ తక్కువలు చేసేవి కాదు. నియమాలను పాటిస్తూ ఎవరైనా ఏ మార్గంలోనైనా జీవిస్తూ 'సేవకులు'గా మారచ్చు. 

విజయీభవ !!!

తత్వోపాసన-నియమం

                        మధ్యభాగం

సృష్టిలో ఉన్న భేదాలు రెండే. ఒకటి, తత్వ ఉపాసకులై పరుల శ్రేయస్సు గురించి ఆలోచించే వారు. రెండు,  తత్వ ఉపాసనకు దూరమై తమ శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచించుకునేవారు.

తత్వ ఉపాసనకు గుణ శుద్ధి అవసరం. పరుల శ్రేయస్సును గురించి ఆలోచించటం తోనే అది మొదలవుతుంది. ఈ ఉపాసనా పద్ధతి సొంతం అవాలంటే ఆహార - సంఘ నియమాలు పాటించాలి. మాయా సంబంధం వల్ల జీవుడు స్వ ఆలోచనలో ఉంటాడు దాన్ని తత్వ ఉపాసన అనే కొలిమిలో భస్మం చేయాలి. అప్పుడే సంఘంలో శ్రేయోజీవనం సాధ్యమవుతుంది. 

తత్వ ఉపాసన చేయాలనుకున్న వారు కచ్చితంగా 'తను' అని ఆలోచించకుండా పరుల మేలు కోరాల్సిందే. పరుల సేవ చేయాల్సిందే. అలాంటి జీవనం సాగించిన వారే మహర్షులు, ప్రవక్తలు, దేవ దూతలు. 

ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి మాంసాహారం, పరస్త్రీ వ్యామోహం ఉన్న వ్యక్తి ఆలోచనలు చేతలు చాలా పరిమితంగా ఉంటాయి దీనికి జడత్వం అని పేరు. ఈ జడత్వాన్ని పెంచుకుని, పోషించుకోవడమే అబ్రాహ్మణ స్థితి. ఇలాంటి జడత్వం నిండిన అబ్రాహ్మణులు ఎప్పటినుంచో సమస్త కులాల్లోనూ మతాల్లోనూ ఉన్నారు. 

ఇక రెండవది చైతన్య స్థితిలో ఉంటూ, ఇతరుల్లో చైతన్యం నింపడానికి కృషి చేయడమే బ్రాహ్మణ స్థితి. ఎవరైతే 'తమ' గురించే ఆలోచనలు లేకుండా పరుల శ్రేయస్సు గురించే ఆలోచిస్తూ ఉంటారో, వారే బ్రాహ్మణులు.  ఇలాంటి బ్రాహ్మణులు ఇప్పటికీ సమస్త కులాల్లోనూ మతాల్లోనూ ఉన్నారు.

తత్వోపాసన-ధర్మం

                      మొదటి భాగం

అనాదిగా ఉన్నది తత్వమే. మతం మధ్యలో వచ్చింది. హిందూ మతమైనా అంతే. 

కనపడని ఈ తత్వం, దాని లక్షణాన్ని జీవుడు ఇష్టపూర్వకంగా .. గురువుకు శుశ్రూష చేస్తూ ఒంటబట్టించు కోవటమే ఆధ్యాత్మిక జీవనం.

అన్నిటికీ మూలమైన ఈ తత్వం ఎవరి జీవనంలో ప్రకాశిస్తే ఆ జీవుడు ధర్మపరుడు అవుతాడు. అలా తత్వోపాసనతో ధర్మపరుడైన వ్యక్తి కదలికే మతం. తన నడవడికే ధర్మం. తను చెప్పేదే ధర్మం. తను ఆచరించేదే ధర్మం. అది అపరిమితం. 

అలా కాక తన నుంచి జీవుడు ప్రతిపాదించే ఏ ధర్మమైనా వికటించి తీరుతుంది. ఆహార నియమం, సంఘ నియమ పాటిస్తూ గురువు చెప్పిన సాధనా మార్గంలో త్రిగుణాలను శుద్ధి చేసుకోవడమే తత్వోపాసనకు తగిన జీవన విధానం. 

తత్వోపాసన లేని ధర్మ చింతన ఓ కల లాంటిది.