Friday, 31 January 2025

తత్వోపాసన-నియమం

                        మధ్యభాగం

సృష్టిలో ఉన్న భేదాలు రెండే. ఒకటి, తత్వ ఉపాసకులై పరుల శ్రేయస్సు గురించి ఆలోచించే వారు. రెండు,  తత్వ ఉపాసనకు దూరమై తమ శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచించుకునేవారు.

తత్వ ఉపాసనకు గుణ శుద్ధి అవసరం. పరుల శ్రేయస్సును గురించి ఆలోచించటం తోనే అది మొదలవుతుంది. ఈ ఉపాసనా పద్ధతి సొంతం అవాలంటే ఆహార - సంఘ నియమాలు పాటించాలి. మాయా సంబంధం వల్ల జీవుడు స్వ ఆలోచనలో ఉంటాడు దాన్ని తత్వ ఉపాసన అనే కొలిమిలో భస్మం చేయాలి. అప్పుడే సంఘంలో శ్రేయోజీవనం సాధ్యమవుతుంది. 

తత్వ ఉపాసన చేయాలనుకున్న వారు కచ్చితంగా 'తను' అని ఆలోచించకుండా పరుల మేలు కోరాల్సిందే. పరుల సేవ చేయాల్సిందే. అలాంటి జీవనం సాగించిన వారే మహర్షులు, ప్రవక్తలు, దేవ దూతలు. 

ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి మాంసాహారం, పరస్త్రీ వ్యామోహం ఉన్న వ్యక్తి ఆలోచనలు చేతలు చాలా పరిమితంగా ఉంటాయి దీనికి జడత్వం అని పేరు. ఈ జడత్వాన్ని పెంచుకుని, పోషించుకోవడమే అబ్రాహ్మణ స్థితి. ఇలాంటి జడత్వం నిండిన అబ్రాహ్మణులు ఎప్పటినుంచో సమస్త కులాల్లోనూ మతాల్లోనూ ఉన్నారు. 

ఇక రెండవది చైతన్య స్థితిలో ఉంటూ, ఇతరుల్లో చైతన్యం నింపడానికి కృషి చేయడమే బ్రాహ్మణ స్థితి. ఎవరైతే 'తమ' గురించే ఆలోచనలు లేకుండా పరుల శ్రేయస్సు గురించే ఆలోచిస్తూ ఉంటారో, వారే బ్రాహ్మణులు.  ఇలాంటి బ్రాహ్మణులు ఇప్పటికీ సమస్త కులాల్లోనూ మతాల్లోనూ ఉన్నారు.

No comments:

Post a Comment